Return to BahaiPrayers.net
Facebook
[యునైటెడ్ స్టేట్స్ కు చెందిన తొమ్మిది ఉత్తరీశాన్య రాష్ట్రాలు: మెయిన్, మసచుసెట్స్, న్యూ హ్యాంప్షర్, రోడ్ ఐలండ్, కనెడికట్, వెర్మాంట్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్ నివాసులైన బహాయిల నుద్దేశించి 1916 సం. మార్చి 26 న బహజీ సౌధంలోని అబ్దుల్-బహా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.]
ఓ స్వర్గదూతలారా!
నౌరూజ్ పర్వదినములివి. సహృదయులైన ఆ మిత్రులను గురించి సదా నేను ఆలోచిస్తూనే ఉంటాను. అమెరికన్ రిపబ్లిక్కులలో జరుగుతున్న ఆ సమావేశాలు - హృదయాలలో భగవంతుని ప్రేమజ్యోతి తేజరిల్లేలా, మైనపువత్తులవలె ప్రజ్జ్వలించి, దివ్యబోధనాకిరణములు ఆ విధముగా అమెరికన్ రాష్ట్రాలను మహత్తర మార్గదర్శకత్వ తారాసమన్వితమైన సువిస్తృతాంతరిక్షము వలె రత్నాలంకృతను, శోభాసమన్వితను గావింపవలెనని - మీలో ప్రతి ఒక్కరి నిమిత్తమూ ఏకత్వద్వారసీమ నుండి అనుగ్రహ, సహకారముల నర్థిస్తున్నాను.
అట్లాంటిక్ తీరంలోని ఉత్తరీశాన్యరాష్ట్రాలు: మెయిన్, న్యూ హ్యాంప్షర్, మసచుసెట్స్, రోడ్ ఐలండ్, కనెడికట్, వెర్మాంట్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్. ఈ రాష్ట్రములలోని కొన్నింటిలో విశ్వాసులున్నారు, అయితే, ఈ రాష్ట్రముల నగరములలో కొన్ని, ఇంకనూ దివ్యసామ్రాజ్యప్రభలతో శోభిల్లనూ లేదు, దివ్యబోధనల నెఱుగనూ లేదు. అందువల్ల, మీలోని ప్రతి ఒక్కరూ వీలున్నప్పుడల్లా ఆ నగరములకు త్వరత్వరగా తరలి, మహత్తర మార్గదర్శకత్వ తేజోసమన్వితులై తారల వలె ప్రకాశింపవలె. భగవంతుడు ఖురాన్లో ఇలా ప్రవచించినాడు:“భూమి నల్లని బీడుగా వుండేది. మే మప్పుడు దానిపై వర్షమును కురియింపచేయగా, తక్షణమే అది హరితము, సస్యశ్యామలము అయినది, సర్వవిధములైన మొక్కలూ సమృద్ధిగా మొలకెత్తినవి.”1 వేరొక విధముగా చెప్పవలెనంటే, నేల నల్లనిదనీ, వసంత కాలపు వర్షపుజల్లులు తనపై వర్షించినప్పు డది సచేతనమైనదనీ, వివిధవర్ణముల పుష్పములూ వికసించాయనీ అంటున్నా డాయన. ప్రాకృత్రిక ప్రపంచమందలి మానవ హృదయాలు మట్టివలె నల్లనివని దీనికి అర్థం. అయితే, దివ్యత్వవాహినులు భువికి దిగివచ్చి, సముజ్జ్వల ప్రభలు సాక్షాత్కరించినప్పుడు హృదయములు పునరుజ్జీవనము నొందుతాయి, ప్రకృతి అనబడే అంధకారము నుండి విముక్తినొందుతాయి, దివ్యమహిమాన్విత కుసుమములు వృద్ధిచెంది, సమృద్ధతను సంతరించుకుంటాయి. పర్యవసానముగా, మానవుడు మనుష్యప్రపంచమునకు చైతన్య కారకుడై, దైవస్ఫూర్తితో పావనగ్రంథావిష్కృత పవిత్రబోధనలను పరివ్యాప్తము సేయుచూ ఉండవలె. మీరు తూర్పు, పడమరలకు పయనించి, మహత్తర మార్గదర్శకత్వకాంతితో ప్రజలను జ్ఞానవంతులను గావింపుడు, తద్వారా, వారు అమరజీవితమునం దొక పాలు నొందెద,2 రని పవిత్ర సువార్తలో ప్రస్తావితమైనది. ఉత్తరీశాన్యరాష్ట్రములు అపార సామర్థ్యమును సంతరించుకొని నందులకు భగవంతుడు శ్లాఘనీయుడు. ఏలయన, భూమి సారవంతము; దివ్యజలధార వర్షిస్తున్నది. మీ రిప్పుడు దివ్యహాలికులై, సిద్ధము సేయబడిన నేలలో స్వచ్ఛబీజములను చల్లవలె. ప్రతి విత్తనపు దిగుబడీ పరిమితమే, అయినను, దివ్యబోధనా బీజముల అనుగ్రహాశీస్సు లపరిమితములు. రానున్న శతాబ్దిలో, కాలావృత్తమునం దింకెన్నియో పంటదిగుబడుల సమీకరణము జరుగ గలదు. దీనిని పూర్వతరముల కృషి యని పరిగణింపుడు. యేసుక్రీస్తు జీవిత కాలమునం దాయనను విశ్వసింపుచుండిన స్థిరచిత్తులు లెక్కకు కొందరే అయినను, దైవాశీస్సు లెంత సమృద్ధిగా వర్షించినవనిన, కొద్ది సంవత్సరములలోనే, లెక్కకు మిక్కిలిగ జనులు సువార్తచ్ఛాయలోనికి ప్రవేశించినారు. “ఒక్క గింజ ఏడు కంకుల నిచ్చును, ప్రతి కంకియు నూరేసి గింజల నొంది యుండు,”3 నని ఖురాన్లో, భగవంతుడు ప్రవచింపనైనది. వేరొక విధముగ చెప్పవలె ననిన, ఒక్కటే ధాన్యపుగింజ ఏడువందల గింజలగును; భగవంతుడు తలచుకొనినచో, వాటిని రెండింతలైనను చేయగలడు. ధన్యజీవి యొక్కడు దేశమునకే మార్గదర్శన హేతువగుట సకృత్తుగా జరుగుతూ వచ్చినదే. మనమిప్పుడు మన శక్తిసామర్ధ్యములను గణనము సేయరాదు; తద్భిన్నముగా, బిందువునుండి అంబుధినీ, అణువునుండి ఆదిత్యుడినీ సృజియించిన భగవంతుని ఉపకృతుల పైనను, అనుగ్రహముల పైనను మన మీనాడు దృష్టిని కేంద్రీకరింపవలె.
మీకు ప్రశంసాభినందనలు!
- `Abdu'l-Bahá