Return   Facebook

The Universal House of Justice

Ridván 2021

To the Bahá’ís of the World

Dearly loved Friends,

దివ్యధర్మచరిత్రలోని ఒక అత్యంత చిరస్మరణీయాధ్యాయంలోని తుది పలుకులను ఇప్పటికి వ్రాయడమై, పుట తిరుగుతున్నది. ఈ రిద్వాన్ - ఒక పంచవర్ష ప్రణాళికకూ, అలాగే 1996లో ఆరంభమైన ప్రణాళికల పరంపర మొత్తానికీ చెందిన - ఒక అసాధారణ సంవత్సరం పరిపూర్తిని సూచిస్తున్నది. నూతన ప్రణాళికల పరంపర ఒకటి - తదుపరి రిద్వాన్‌కు ఆరంభం కావలసిన నవవర్ష ప్రయత్నానికి పూర్వరంగంగా ఉపకరిస్తాయన్న వాగ్దానంతో కూడిన పన్నెండు అత్యంత ప్రాధాన్యతాయుత మాసాలతో - సంకేతాన్నిస్తున్నది. సత్వరమే శక్తిని సంతరించుకుని, పెద్దపెద్ద అంగలను వేసుకుంటూ ముందుకు సాగేందుకు సంసిద్ధమైన సమాజం మా ముందర అగుపిస్తున్నది. అయితే, ఈ దశను అందుకోవడానికి ఎంతటి ప్రయాస అవసరమైంది, ఆ క్రమంలో―నేర్చిన పాఠాలు సమాజ భవితకు ఆకృతి నిస్తాయి, వాటిని ఎలా నేర్చుకోవడం జరిగింది అనే వైనం రానున్నదాని మీదికి వెలుగును ప్రసరిస్తుందనే దానిని గురించి―ఏర్పరుచుకోబడిన అవగాహనలు ఎంతటి కష్టసాధ్యాలు అన్న దానిని గురించి ఎలాంటి అపోహలూ ఉండకూడదు.

తమవైన పురోగమనాలతో, అవగాహనలతో సమృద్ధిని సంతరించుకుని 1996కు దారితీస్తూ వచ్చిన దశాబ్దాలు, అనేక సమాజాలలోని అసంఖ్యాక ప్రజలు దివ్యధర్మ పతాకం దిగువకు చేరేందుకు సంసిద్ధ మౌతారనడంలో, ఎటువంటి సందేహానికీ సందివ్వలేదు. భారీ స్థాయి నమోదులకు దృష్టాంతాలుగా ఉత్తేజకరమైనవే అయినా, భిన్న నేపధ్యాలలో నెలకొనగలిగి స్థిరంగా కొనసాగించబడగల అభివృద్ధి ప్రక్రియకు అవి సరితూగ లేదు. సమాజానికి లోతైన సమస్యలు ఎదురయ్యాయి; సముచితంగా స్పందించడానికి ఆ సమయంలో దానికి ఉన్నది అరకొర అనుభవమే. తన విస్తరణకు ఉద్దేశితమైన యత్నాలు దృఢీకరణ ప్రక్రియతో చేయీచేయీ కలుపుకుని ముందుకు సాగి, అభివృద్ధిని స్థిరంగా కొనసాగించడమన్న దీర్ఘకాలిక, దుస్సాధ్యగోచర సమస్యను ఎలా పరిష్కరించగలవు? బహాఉల్లా బోధనలను కార్యరూపంలోకి పరివర్తన చెందించే వ్యక్తులూ, వ్యవస్థలూ, సమాజాలూ ఎలా ఉత్పన్నం కాగలవు? ఇక, బోధనలకు ఆకర్షితులైనవారు, అంతర్జాతీయ ఆధ్యాత్మిక మహత్కార్యంలో ఎలా ప్రధాన పాత్రధారులు కాగలరు?

సరే, ఒక పావు శతాబ్దానికి పూర్వం, భగవంతుని దివ్యధర్మహస్తాలు ఇంకా ముగ్గురు తనకు ముందు శ్రేణులలో ఉండగా - తనకు పూర్వం అమలైన వాటికన్నా తనకు విలక్షణతను చేకూర్చిన ’సామూహిక ధర్మావలంబన ప్రక్రియలో గణనీయ పురోగమనం’ అనే ఏకైక లక్ష్యం మీద తన దృష్టిని నిలిపినటువంటి - చతుర్వర్ష ప్రణాళికలోకి ప్రవేశించిన బహాయి సమాజం అది. ఈ లక్ష్యం - అటుపై అమలులోకి వచ్చిన ప్రణాళికల పరంపరను నిర్ధారించింది. సమాజం అప్పటికే, ఈ ప్రక్రియ - కేవలం గణనీయంగా సమూహాలు దివ్యధర్మంలోకి ప్రవేశించడం మాత్రమే కాదు, అప్రయత్నంగా ఇది సంభవించేదీ కాదు అన్న అవగాహనకు వచ్చివేసింది; నిబద్ధతాయుతమూ, క్రమానుగుణమూ, త్వరితమూ అయిన విస్తరణ-దృఢీకరణలను అది సూచిం చింది. అసంఖ్యాకుల చైతన్యప్రపూరిత భాగస్వామ్యం ఈ కృషికి అవసరమౌతుంది; ఇది అనివార్యం గావించిన బృహత్తర విద్యాసమస్యను స్వీకరించవలసిందని 1996లో, బహాయి ప్రపంచాన్ని ఆమంత్రించడం జరిగింది. అభివృద్ధి ప్రక్రియను స్థిరంగా కొనసాగించేందుకు అవసరమైన సమర్ధతలతో అనుగ్రహీతులైన వ్యక్తుల బృహత్ప్రవాహాన్ని ఉత్పాదించడంపై దృష్టిని కేంద్రీకరించిన శిక్షణాసంస్థానాల యంత్రాంగాన్ని నెలకొల్పవలసిందని, దానికి పిలుపునివ్వడం జరిగింది.

కార్యోన్ముఖులైన మిత్రులకు - బోధనారంగంలో తమ పూర్వవిజయాలు ఎటువంటివైనప్పటికీ, తాము ఏ సామర్ధ్యాలను సముపార్జించుకోవాలి, ప్రధానంగా, వాటిని ఎలా సముపార్జించుకోవాలి అన్న దానిని గురించి తాము స్పష్టంగా నేర్చుకోవలసిన దెంతో ఉందని తెలుసు. సమాజం ఆచరణ ద్వారా, అనేక విధానాలలో నేర్చుకుంటుంది; అది నేర్చిన పాఠాలు, కాలక్రమంలో విభిన్న నేపధ్యాలలో వినియోగించబడడం ద్వారా వడపోతకు లోనై, పరిష్కృతాలైన మీదట, అంతిమంగా విద్యాసంబంధిత అధ్యయనపాఠ్యాలలోకి విలీనం గావించబడతాయి. కొన్ని నిర్దిష్ట కార్యకలాపాలు, ఒక ప్రజాసమూహపు టాధ్యాత్మికావసరాలకు సహజస్పందన అని గుర్తించడం జరిగింది. ఇందుకు సంబంధించి - అధ్యయన కేంద్రాలు, బాలల తరగతులు, ఆధ్యాత్మిక సమావేశాలు, అటుపై కిశోరప్రాయుల బృందాలు కీలక ప్రాధాన్యతా సమన్వితాలై నిలిచాయి; సంబంధిత కార్యక్రమాలతో అవి సమ్మిళితమైనప్పుడు ఉత్పన్నమైన పరివర్తనాత్మక శక్తి, సమాజజీవితానికి సంబంధించిన చైతన్యప్రపూరిత సరళి ఒక దానిని నెలకొల్పగలిగింది. ఇక, ఈ ప్రధాన కార్యక్రమాలలో పాల్గొనేవారి సంఖ్యలు పెరిగేకొద్దీ, వాటి మౌలికలక్ష్యానికి ఒక నూతన పార్శ్వాన్ని చేర్చడం జరిగింది. అవి -యువజనులూ, వయోజనులూ, ఇంకా విస్తృత సమాజంలోని కుటుంబాలకు కుటుంబాలే బహాఉల్లా దివ్యావిష్కరణ సమక్షంలోకి ప్రవేశించగలిగిన ద్వారసీమలుగా ఉపకరించాయి. ‘సముదాయం’ - విశిష్ట సామాజిక లక్షణాలతో కూడిన నిర్వహణీయ భౌగోళిక ప్రాంతం - అనే నేపధ్యంలో సమాజనిర్మాణ కృషికి వ్యూహాలను ఆలోచించడం ఎంత ఆచరణాత్మకమో కూడా స్పష్టమౌతూ వచ్చింది. సాముదాయిక స్థాయిలో సాధారణ ప్రణాళికలను రూపొందించగల సామర్ధ్యం వృద్ధిచెంద నారంభించింది, ఇక అటువంటి ప్రణాళికల నుండి, త్రైమాసిక కార్యక్రమావృత్తాలుగా వ్యవస్థీకృతాలైన దివ్యధర్మ అభివృద్ధి కార్యక్రమాలు ఆవిర్భవించాయి. ముందుగా వెల్లడైన ముఖ్యాంశం: శిక్షణాక్రమాల శ్రేణిలో వ్యక్తుల ప్రస్థానం, నిరంతరాభివృద్ధి వెంట సముదాయాల ప్రస్థానానికి ప్రేరణను ఇస్తుంది, దానిచే స్థిరీకృతమౌతుంది అన్న దానిని గురించి. ఈ పరస్పరాశ్రయ సంబంధం తమ స్వీయపరిసరాలలో అభివృద్ధి స్పందనను మదింపుచేసి, మరింత శక్తి దిశగా మార్గాన్ని ఏర్పరచుకోవడంలో ప్రపంచవ్యాప్తంగా మిత్రులకు సహాయపడింది. సముదాయంలో జరుగుతున్న దానిని మూడు విద్యా ప్రాధాన్యతల అంటే―బాలలకూ, కిశోరప్రాయులకూ, యువజనులకూ-వయోజనులకూ సేవలను అందించడం―దృక్కోణం నుండీ, అభివృద్ధి లయగతికి అతి ముఖ్యమైనటువంటి కార్యావృత్తాల దృక్కోణం నుండీ కూడా చూడడం ఉపయుక్తమని, కాలక్రమేణా, నిరూపితమైంది. ఇరవయ్యైదు సంవత్సరాల కృషిని విడివిడిగా పరిశీలిస్తే, అభివృద్ధి ప్రక్రియకు సంబంధించి మేమీనాడు చూస్తున్న అత్యంత విశిష్టలక్షణాలలో చాలావరకూ, అప్పట్లో బాగా నెలకొంటున్నటువంటివే.

మిత్రుల యత్నాలు ఉధృతమౌతున్న కొద్దీ, అభివృద్ధి ప్రక్రియకున్న సార్వత్రిక ఔచిత్యానికి సంబంధించిన వివిధ నియమాలూ, భావనలూ, వ్యూహాలూ - నూతనాంశాలకు స్థానాన్ని కల్పించేలా పరిణమించగల ఒక కార్యసారణిగా స్ఫటికీకృతం కానారంభించాయి. ఈ కార్యసారణి అత్యద్భుత చైతన్యాన్ని కలిగించడంలో కీలకంగా నిరూపితమైంది. తమ శక్తిసామర్ధ్యాలను చైతన్యోపేత సమాజాల అభివృద్ధికి హితకరమైన రీతుల్లో వినియోగించడంలో, ఇది మిత్రులకు తోడ్పడిందని అనుభవం వెల్లడించింది. అయితే, కార్యసారణి అంటే ఒక నిర్దిష్టసూత్రం కాదు. ఒక సముదాయపు, ప్రదేశపు, లేదంటే ఒక సామీప్య ప్రాంతపు టధివాస్తవికతను అంచనా వేస్తున్నప్పుడు కార్యసారణికి సంబంధించిన వివిధాంశాలనూ పరిగణనలోకి తీసుకోవడం ద్వారా, ఆ ప్రాదేశిక వివరాలకు స్పందిస్తూనే, తక్కిన బహాయి ప్రపంచం నేర్చుకుంటున్న దానిని వినియోగించిన కార్యాచరణ నమూనా ఒకదానిని రూపొందించవచ్చు. ఒక వంకన కఠినమైన అవసరాలు, మరోవైపున అంతులేని వ్యక్తిగత ప్రాధాన్యతలు- వీటి మధ్యన ఏర్పడిన ద్వైదీభావం: సమగ్రమైనదీ, అనుభవం సమీకరించుకోబడే కొద్దీ నిరంతరాయంగా మెఱుగు పరచబడుతూ ఉండేదీ అయిన ఒక ప్రక్రియకు సహకరించడంలో వ్యక్తులు ఉపయోగించగల వైవిధ్యభరిత విధానం గురించిన మరింత సునిశిత అవగాహనకు దారిని వదిలివేసింది. ఈ కార్యసారణి ఆవిర్భావంతో సూచితమైన పురోగమనం: అంటే యావత్ బహాయి ప్రపంచ ప్రయత్నాలనూ సమన్వయీకరించడానికీ, సమైక్యపరచడానికీ, దాని పురోగమనయాత్రకు ప్రేరణనివ్వడానికీ సంబంధిం చిన అంతరార్ధాలు మహత్తర పరిణామసమన్వితాలే నన్న దానిని గురించి ఏ సందేహమూ ఉండరాదు.

ప్రణాళిక ననుసరించి ప్రణాళిక ప్రవేశిస్తుండగా, సమాజనిర్మాణ కార్యక్రమంలో నిమగ్నం కావడం మరింత విస్తృత ప్రాతిపదికను సంతరించుకుంటుండగా - సాంస్కృతిక స్థాయిలో పురోగమనాలు మరింత ప్రాధాన్యతాయుతాలైనాయి. ఉదాహరణకు పిన్నతరాలను విద్యావంతులను గావించడానికి గల ప్రాముఖ్యతను, ప్రత్యేకించి కిశోరప్రాయులు ప్రదర్శించిన అసాధారణ అంతర్గతశక్తి మాదిరిగానే, మరింత విస్తృతంగా అవగతం చేసుకోవడం జరిగింది. ఉమ్మడిపథంలో వ్యక్తులు ఒకరికొకరు సహకరించుకుంటూ, తోడ్పాటును అందించుకుంటూ, అన్యోన్యసహకార వలయాన్ని అవిచ్ఛిన్నంగా విస్తృతపరుచు కుంటూ ఉండడమన్నది - సేవాసామర్ధ్యాన్ని పెంపొందించేందుకు ఉద్దేశితమైన అన్ని యత్నాలూ అభిలషించిన నమూనా అయింది. ఆధ్యాత్మిక లాలిత్యాలను జ్వలింపచేసి, ప్రవృద్ధం గావించడంలో, అర్ధవంతమైన చర్చలకు గల శక్తిని గురించిన చైతన్యం పెరుగుతూ ఉండేకొద్దీ మిత్రుల మధ్యనా, వారి చుట్టూతా ఉన్నవారితోనూ జరిగే వైయక్తిక వ్యవహరణాలు సైతం మార్పుకు లోనయ్యాయి. ఇక, ప్రధానంగా, బహాయి సమాజాలు మరింత సువిశాలదృక్పథాన్ని అలవరుచుకున్నాయి. దివ్యధర్మ దార్శనికతకు స్పందించే ఏ వ్యక్తి అయినా―ప్రోత్సాహకుడైనా, నిర్వాహకుడైనా సరే―విద్యాకార్యకలాపాలలోనూ, ఆరాధనా సమావేశాలలోనూ, సమాజనిర్మాణ కార్యక్రమంలోని తక్కిన అంశాలలోనూ క్రియాశీలక భాగస్వామి కాగలిగాడు; అటువంటి వ్యక్తులలో చాలామంది బహాఉల్లా పట్ల తమ విశ్వాసాన్ని ప్రకటిస్తారు కూడా. అలా - వాదాల మీదా, ఊహల మీదా తక్కువగానూ; ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఎలా దివ్యధర్మాన్ని కనుగొనగలిగారు, దానితో చక్కని పరిచయాన్ని ఏర్పరుచుకోగలిగారు, దాని లక్ష్యాలతో భావసారూప్యతను ఏర్పరుచుకోగలిగారు, దాని కార్యకలాపాలలో, చర్చలలో పాల్గొనగలిగారు, దానిని― చాలా సందర్భాలలో―అవలంబించగలిగారు అన్న వాస్తవానుభవం మీద ఎక్కువగానూ ఆధారపడిన సామూహిక ధర్మావలంబనా భావన ఒకటి అవతరించింది. వాస్తవానికి, ప్రాంతం వెంట ప్రాంతంగా శిక్షణాసంస్థాన ప్ర‘కియ పటిష్టం కాబడుతూ ఉండే కొద్దీ, ప్రణాళికా కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న వ్యక్తుల సంఖ్య - దివ్యధర్మంతో ఈ మధ్యనే పరిచయం ఏర్పడిన వారికి సైతం విస్తరిస్తూ - ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. అయితే, ఇది కేవలం అంకెల పట్ల అనురక్తితోనే ప్రేరేపితమౌతూ రాలేదు. భగవద్వచనపు టధ్యయనం మీదా, గంభీరమైన ఆధ్యాత్మిక ఘట్టంలో ప్రధానపాత్రధారి కావడంలో ప్రతి ఒక్కరి సామర్ధ్యం పట్లనూ గల అవగాహన మీదా ఆధారితమై, ఏకకాలంలో నెలకొంటున్న వ్యక్తిగత, సమిష్టి పరివర్తనాత్మక దార్శనికత - ఒక సమిష్టిప్రయత్న స్పృహను రేకెత్తించింది.

ఈ ఇరవయ్యైదు సంవత్సరాల కాలానికీ సంబంధించిన అత్యంత మహత్తర, స్ఫూర్తిప్రద లక్షణాలలో ఒకటి: సమాజ యత్నాల పరంగా ప్రథమశ్రేణిలో తమ న్యాయబద్ధమైన స్థానాన్ని విశ్వాసంతోనూ, నిబ్బరంతోనూ వహించిన బహాయి యువజనులు అందించిన సేవ. దివ్యధర్మబోధకులుగానూ, పిన్నల అధ్యాపకులుగానూ, సంచార శిక్షకులుగానూ, స్థానీయ పయొనీర్లుగానూ, సాముదాయిక సంచాలకులుగానూ, బహాయి ప్రాతినిధ్యసంస్థల సభ్యులుగానూ - ఐదు ఖండాల యువజనులూ తమ సమాజాలను దీక్షతోనూ, త్యాగనిరతితోనూ సేవించడానికి ఉద్యమించారు. దివ్యప్రణాళికా పురోగమనం ఆధారితమై ఉన్న విధుల నిర్వహణలో వారు ప్రదర్శించిన పరిణితి - వారి ఆధ్యాత్మిక చైతన్యంలోనూ, మానవజాతి భవితను పరిరక్షించడం పట్ల వారి నిబద్ధతలోనూ అభివ్యక్తమౌతున్నది. అధికాధికంగా ప్రస్ఫుటమౌతున్న ఈ పరిణితికి గుర్తింపుగా, ఈ రిద్వాన్ తరువాయి నుండీ, స్థానిక సభకు సేవలను అందించేందుకు విశ్వాసి అర్హుడయ్యే వయస్సు ఇరవై ఒకటిగానే ఉండాలనీ, అయినా విశ్వాసి బహాయి ఎన్నికలలో ఓటును వేయగలిగే వయస్సు పద్ధెనిమిదికి తగ్గించబడాలనీ నిర్ణయించాం. ప్రతి నిర్వాచిత బహాయీ ఆహ్వానితుడైన ‘పవిత్ర కర్తవ్యా,‘ న్ని, ‘అప్రమత్తంగా, శ్రద్ధగా’ నెరవేర్చడంలో తమ సమర్ధత పట్ల మా విశ్వాసాన్ని ప్రపంచవ్యాప్తంగా యుక్తవయస్కులైన బహాయి యువజనులు నిలుపుకుంటారనడంలో మాకు సందేహం లేదు.

సమాజాల అధివాస్తవికతలు విపరీతంగా భేదిస్తాయన్నది, సహజంగా, మే మెరిగినదే. వివిధ జాతీయ సమాజాలూ, ఆ సమాజాలున్న వివిధ ప్రదేశాలూ ఈ ప్రణాళికల పరంపరను - అభివృద్ధికి సంబంధించిన వివిధ దశల వద్ద ఆరంభించాయి; అప్పటినుండీ, అవి సైతం వివిధ వేగాలతో వృద్ధి చెందాయి, ప్రగతిపరంగా వివిధ స్థాయిలను అందుకున్నాయి. ఇదీ, క్రొత్తదేమీ కాదు. సమస్య ఎప్పుడూ, ప్రాదేశిక పరిస్థితులు - ఆయా చోట్ల కనుగొనబడిన సానుకూలవైఖరి స్థాయి మాదిరే - వ్యత్యాసభరితాలై ఉంటాయన్న దానితోనే. అయినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాటి సమాజాల విజయంతో ఉత్తేజితాలై , సామర్ధ్య, విశ్వాస, సంచితానుభవాల పరంగా పలు సమాజాలు పెంపొందించుకుంటున్న ఆలోచనా ధోరణి ఉధృతిని సైతం అవలోకిస్తున్నాం. ఉదాహరణకు - 1996లో ఒక నూతన ప్రదేశానికి దివ్యధర్మపరిచయం చేసేందుకు ఉద్యుక్తులైనవారిలో ధైర్యానికీ, విశ్వాసానికీ, దీక్షకూ కొదవలేదు; ఈనాడు, ప్రపంచవ్యాప్తంగా వారి సమస్థాయిలో ఉన్నవారు అవే లక్షణాలను - విస్తరణ, దృఢీకరణల కృషిని క్రమబద్ధీకరించి, మెఱుగు పరిచేందుకై యావత్ బహాయి ప్రపంచమూ చేసిన ఇరవై ఐదు సంవత్సరాల కృషితో సమీకరించబడిన పరిజ్ఞానంతో, అవగాహనలతో, నైపుణ్యాలతో మేళవిస్తున్నారు.

ఇది - విశ్వాసం, పట్టుదల, నిబద్ధత అనబడే లక్షణాలను నేర్చుకోవాలన్న సంసిద్ధతతో మిళితం చేసినప్పుడు, ఒక సమాజపు టారంభదశతో ప్రమేయం లేకుండా, అభివృద్ధి ప్రక్రియను పురోగమింప చేసింది. వాస్తవానికి, ఈ ప్రణాళికల పరంపరకు సంబంధించి సంక్రమించిన ఒక మనోజ్ఞ భావన: పురోగమించేందుకై చేసే ఏ ప్రయత్నమైనా, నేర్చుకోవాలన్న దృక్పథంతో మొదలౌతుందనే సువిస్తృత గుర్తింపు. ఈ నియమపు నిరాడంబరత, దీనిని వెన్నంటి ఉన్న అంతరార్ధాల ప్రాముఖ్యతను అగుపడనివ్వడం లేదు. ప్రతి సముదాయమూ, నిర్ణీత సమయంలో, నిరంతరాభివృద్ధి వెంట పురోగమిస్తుందన్న దానిని మేము సందేహించం; అత్యంత త్వరితంగా పురోగమించిన సమాజాలు, తమ స్థితులూ, సాధ్యతలూ సారూప్యంగా ఉన్న వాటితో పోల్చుకున్నప్పుడు - భావైక్యతను ప్రోత్సహించగల ప్రభావశీల కార్యక్రమాన్ని గురించి తెలుసుకోగల దక్షతను ప్రదర్శించాయి. ఆ ప్రదర్శనను అవి కార్యక్రమనిర్వహణకు వెనుదీయకనే, చేశాయి.

నేర్చుకోవడం పట్ల నిబద్ధతకు అర్ధం కూడా, తప్పులు చేయడానికి సంసిద్ధమై ఉండడవేు―అయినా, తప్పులు కొన్నిసార్లు, అసౌకర్యాన్ని తెచ్చిపెట్టాయి. అనుభవరాహిత్యం వల్ల, మొదట్లో నూతన పద్ధతులనూ, విధానాలనూ తెలిసీతెలియ కుండా వినియోగించడం జరిగిందంటే, ఆశ్యర్యం లేదు; అప్పుడప్పుడూ, ఒక సమాజం - నూతనంగా అలవరుచుకున్న ఒక విధమైన సామర్ధ్యాన్ని, తాను ఇంకొకదానిని అభివృద్ధి చేసుకోవడంలో నిమగ్నమై ఉండగా, నష్టపోవడం జరిగింది. ఉత్తమలక్ష్యాలు ఉండడమన్నది తప్పటడుగులు పడవనడానికి హామీ కాదు, వాటిని అధిగమించడానికి వినమ్రతా, నిర్మోహత్వమూ అవసరం. సహిష్ణుతను ప్రదర్శించాలి, సహజంగా సంభవించే పొరపాట్లనుండి నేర్చుకోవాలి అన్న దృఢసంకల్పంతో సమాజం ఉన్నప్పుడు, ప్రగతి ఎప్పుడూ కనుచూపుమేరను దాటిపోలేదు.

ప్రణాళికల పరంపర మధ్యకాలంలో, సాంఘిక జీవితంలో సమాజం పాత్ర మరింత నిశితదృష్టికి కేంద్రబిందువు కానారంభించింది. దీనిని గురించి సామాజిక కార్యక్రమమూ, వర్తమాన సాంఘిక చర్చలలో పాల్గొనడమూ అనే రెండు పరస్పర సంబంధమున్న కార్యరంగాలపరంగా ఆలోచించవలసిందని విశ్వాసులను ప్రోత్సహించడం జరిగింది. అయితే, ఇవి విస్తరణ-దృఢీకరణల కృషికి ప్రత్యామ్నాయాలూ కాలేదు, దానినుండి ప్రక్కత్రోవ పట్టించాయనడానికీ లేదు: అవి అందులోని అంతర్భాగాలే. ఒక సమాజం ఆహ్వానించగలిగిన మానవవనరులు ఎంత మహత్తరమైనవైతే, బహాఉల్లా దివ్యావిష్కరణలో నిక్షిప్తమై ఉన్న విజ్ఞతను సమకాలీన సమస్యల సాధనకు―ఆయన బోధనలను వాస్తవరూపంలోకి పరివర్తన చెందించడానికి― వినియోగించడంలో దాని సామర్ధ్యం అంత మహత్తరమూ అయింది. ఈ కాలగమనంలో, మానవాళి సంకటపరిస్థితులు - దివ్యవైద్యుడు సూచించిన ఔషధంకోసం అదెంత ఆర్తితో కాంక్షిస్తున్నదో నొక్కి వక్కాణిస్తున్నా యనిపిస్తున్నది. దీనంతటిలోనూ అంతఃసూచితమై ఉన్నది -- విస్తృతప్రపంచంలో ప్రబలి ఉన్న వాటికన్నా ఒక పూర్తి విభిన్నమైన మతసంబంధిత భావన: మతాన్ని - నిత్యపురోగమనశీల నాగరికతకు ప్రేరేపణనిస్తున్న బలీయశక్తిగా గుర్తించిన భావన అది. అటువంటి నాగరికత అయత్నకృతంగా, తన స్వీయేచ్ఛతో అవతరించదనీ, దాని ఆవిర్భావానికై శ్రమించడం బహాఉల్లా అనుయాయుల లక్ష్యమనీ గ్రహించడం జరిగింది. అటువంటి లక్ష్యం - సువ్యవస్థితమైన ఇదే జ్ఞానార్జనాప్రక్రియను సామాజిక కార్యక్రమానికీ, ప్రజాచర్చలలో పాల్గొనడానికీ ప్రయోగించడాన్ని బలంగా ఆశించింది.

గత రెండున్నర దశాబ్దాల దృక్కోణం నుండి చూసినప్పుడు, సామాజిక కార్యక్రమ నిర్వహణాసామర్ధ్యం - కార్యక్రమం పరంగా అసాధారణ వికాసానికి దారితీస్తూ - గణనీయంగా పెరిగింది. ఏడాది నుండి ఏడాదికి దాదాపు 250 సాంఘిక ఆర్ధికాభివృద్ధి పథకాలు స్థిరంగా కొనసాగించబడుతూ ఉండిన 1996తో పోల్చుకుంటే ఇప్పుడవి 1,500; బహాయి స్ఫూర్తిత సంస్థల సంఖ్య 160ని దాటిపోవడానికని నాలుగింతలైంది. ప్రతి సంవత్సరమూ 70,000 స్వల్పకాలిక అట్టడుగుస్థాయి సామాజిక కార్యక్రమ పధకాలను చేపట్టడం జరుగుతున్నది; యాభయ్యింతల పెరుగుదల అది. బహాయి ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఇప్పుడు అందించిన నిబద్ధతాయుత సహకార, ఉద్దీపనల పర్యవసానాలైన ఈ ప్రయత్నాలన్నింటి నిరంతరాభివృద్ధికై ఉత్కంఠతో నిరీక్షిస్తున్నాం. ఈ లోపున వర్తమాన సాంఘిక చర్చలలో బహాయిలు పాల్గొంటూ ఉండడం కూడా అపారంగా పెరిగింది. పనిలో నైనా, వ్యక్తిగత నేపధ్యంలోనైనా చోటుచేసుకునే చర్చలలో బహాయి దృక్పథాన్ని తాము వ్యక్తం చేయగలమని మిత్రులు భావించే పలు సందర్భాలతో పాటు, చర్చలలో మరింత సాధికారికంగా పాల్గొనడం గణనీయంగా పెరిగింది. ఈ కాలంలో ఆఫ్రికా, ఆసియా, ఐరోపాలలో అనుబంధ కార్యాలయాలను ఏర్పాటు చేసిన బహాయి అంతర్జాతీయ సమాజం యెక్క సువిస్తృత ప్రయత్నాలూ, అత్యంతాధునిక సహాయసహకారాలూ మాత్రమే కాక, బాహ్యవ్యవహారాలకు సంబంధించిన జాతీయ కార్యా లయాల - విస్తారంగా ప్రవర్ధితమై, మరింతగా పటిష్టీకృతమై, ప్రధానంగా ఈ కార్యరంగం పైనే దృష్టిని పెట్టిన యంత్రాంగం - కృషి సైతం మా మనస్సులో ఉన్నది; అదనంగా, వైయక్తిక విశ్వాసులు విశిష్ట రంగాలకు అందించిన అవగాహనాపూర్వకమైన, గణనీయ సహాయసహకారాలూ ఉన్నాయి. ఒక విధంగా, ఇదంతా - దివ్యధర్మాన్ని గురించీ, దాని అనుయాయులను గురించీ, వారి కార్యకలాపాలను గురించీ సమాజంలోని అన్ని స్థాయిల మేధావులూ, ఇంకా ఇతర ప్రముఖ వ్యక్తులూ పదేపదే వ్యక్తం చేస్తూవచ్చిన మాన్యతనూ, అభినుతినీ, అభిమానాన్నీ వర్ణించడానికి దోహదం చేస్తుంది.

ఇరవయ్యైదు సంవత్సరాల కాలమంతటినీ సమీక్షించే క్రమంలో, బహాయి ప్రపంచం ఏకకాలంలో సాధించిన బహురీతుల ప్రగతితో విస్మితులమయ్యాం. ఇప్పటికే చర్చించిన కార్యరంగా లన్నింటిలోనూ, దాని పురోగమనాలతో మాత్రమే కాక, బహాయి రచయితలు ప్రచురించిన సమున్నతస్థాయి సాహిత్య పరిమాణంతోనూ, బోధనల నేపధ్యంలో కొన్ని విశిష్టాంశాల అధ్యయనానికి వేదికల రూపకల్పనతోనూ, దివ్యధర్మ వ్యవస్థల సహకారంతో, ఇప్పుడు నూటికి పైగా దేశాల బహాయి యువతకు ఉపకరిస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ గ్లోబల్ ప్రాస్పరిటీ ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన అండర్ గ్రాడ్యుయేట్ల, గ్రాడ్యుయేట్ల సదస్సుల ప్రభావంతోనూ కూడా ప్రదర్శితమైనట్లుగా - దాని మేధోజీవితం వృద్ధి చెందింది. ఆరాధనామందిరాల నిర్మాణ యత్నాలు వేగవంతాలైనట్లు ప్రస్ఫుటమైంది. గత మాతృమందిరం చిలీలోని శాన్‌టియాగోలో నిర్మితమైంది, రెండు జాతీయ, ఐదు స్థానిక మష్రిఖుల్-అఝ్కార్‌లను నిర్మించడానికి పధకాలను ఆరంభించడం జరిగింది; కంబోడియాలోని బత్తమ్‌బాంగ్‌లోనూ, కొలంబియాలోని నోర్టా డెల్ కౌకాలోనూ ఆరాధనా మందిరాల ద్వారాలు ఈ సరికే తెరుచుకున్నాయి. బహాయి ఆలయాలు, నూతనావిష్కృతాలైనా, పూర్వసంస్థాపితాలైనా సమాజజీవితంలో స్థానాన్ని ఎక్కువగా ఆక్రమిస్తున్నాయి. భగవన్మిత్రులు చేపట్టిన బహువిధ యత్నాలకు విశ్వాసుల శ్రేణులు అందించిన భౌతిక సహకారం, ఔదార్యప్రపూరితంగా ఉంటూ వచ్చింది. మామూలుగా సమిష్టి ఆధ్యాత్మిక చైతన్యపూరిత చర్యగా చూసుకున్నప్పడు, అనల్పమైన ఆర్ధికసంక్షోభ సమయంలో, సంక్లిష్టమైన నిధుల వితరణ ఔదార్యంతోనూ, త్యాగంతోనూ నిర్వహించబడడం―కాదు, శక్తిసమన్వితం గావించబడడం―ఎంతైనా అర్ధవంతంగా ఉన్నది. బహాయి పరిపాలనా పరిధిలో, తమ సమాజాల వ్యవహారాలను - వాటి సంపూర్ణ సంక్లిష్టతతో - నిర్వహించుకోవడంలో జాతీయ ఆధ్యాత్మిక సభల సామర్ధ్యం గణనీయంగా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా అట్టడుగు స్థాయిల నుండి అవగాహనల సమీకరణను క్రమబద్ధీకరించడంలోనూ, అవి విస్తృతప్రాచుర్యాన్ని పొందేలా చూడడంలోనూ దోహదకారులైన సలహాదారుల నూతనస్థాయి తోడ్పాటుతో అవి ప్రత్యేకించి లబ్ధిని పొందాయి. ప్రాంతీయ బహాయి కౌన్సిల్ ఒక పూర్తిస్థాయి దివ్యధర్మవ్యవస్థగా అవతరించిన తరుణం అది, ఇప్పుడు 230 ప్రాంతాలలోని - కౌన్సిళ్లూ, అవి పర్యవేక్షించే శిక్షణాసంస్థానాలూ అభివృద్ధి ప్రక్రియను పురోగమింప చేయడంలో తమను తాము అత్యావశ్యకమైనవిగా నిరూపించుకున్నాయి. హుఖుఖుల్లా ప్రధాన ధర్మకర్తా, భగవంతుని దివ్యధర్మహస్తమూ అయిన ఆలీ-మహమ్మద్ వార్ఖా విధులను భవిష్యత్తులో కొనసాగింప చేసేందుకై, అంతర్జాతీయ హుఖుఖుల్లా ధర్మకర్తల మండలిని 2005లో స్థాపించడం జరిగింది; ప్రపంచమంతటికీ విస్తరిస్తూ 1000 మందికి పైగా ప్రతినిధుల కృషికి పథనిర్దేశం గావిస్తున్న 33 కు తక్కువ కాని జాతీయ, ప్రాంతీయ ధర్మకర్తల మండళ్ల యత్నాలను ఇవ్వాళ అది సమన్వయీకరిస్తున్నది. ఇదే సమయంలో బహాయి ప్రపంచ కేంద్రం వద్ద చోటుచేసుకున్న పరిణామాలు అనేకం: బాబ్ దివ్యసమాధి సోపానపంక్తుల నిర్మితినీ, ధనురాకృతిపై భవనద్వయ పరిపూర్తినీ, అబ్దుల్-బహా దివ్యసమాధి నిర్మాణారంభాన్నీ అవలోకించండి; ఇక దివ్యధర్మానికి సంబంధించిన అనర్ఘ పవిత్రస్థలాలను పటిష్టీకరించి, పరిరక్షించే పలు పధకాల సంచయాన్ని గురించిన విషయ ప్రస్తావన అవసరం లేదు. బహాఉల్లా దివ్యసమాధీ, బాబ్ దివ్యసమాధీ ప్రవంచ వారసత్వ స్థలాలుగా, మానవాళికి అనంత ప్రాధాన్యతాయుత ప్రదేశాలుగా గుర్తించబడినాయి. కొన్ని సంవత్సరాలలో ఒకటిన్నర మిలియన్ల సంఖ్యను అందుకుంటూ, ప్రజలు ఈ పవిత్రప్రదేశాలకు లక్షలాదిగా వెల్లువెత్తారు; ప్రపంచ కేంద్రం క్రమం తప్పకుండా ఒకేసారి వందల మంది పుణ్యయాత్రీకులకు - ఒక్కోసారి ఏడాదికి 5,000 మందికి పైగా, అంతేమంది బహాయి సందర్శకులతోనూ - స్వాగతాన్ని పలికింది; పెరిగిన సంఖ్యతో ఎంతగా ఆనందించామో, పుణ్యయాత్రాభాగ్యంలో పాలుపంచుకునే వారిలో వివిధ ప్రజల, దేశాల లెక్కతో అంతగానూ ఆనందించాం. పది భాషలలో లభ్యమౌతున్న బహాయి. ఆర్గ్ కు అనుబంధంగా అభివృద్ధి చెందు తున్న వెబ్‌సైట్ల సమాహారంలోని అత్యంత ప్రధానాంగాలలో ఒకటైన బహాయి రిఫరెన్స్ లైబ్రరీ విస్తరణకు సమాంతరంగా పవిత్రలేఖనాల అనువాద, ప్రచురణ, వితరణలను సైతం మరింతగా వేగవంతం చేయడం జరిగింది. బహాయి ప్రపంచ వ్యాప్తంగా బహువిధ కార్యరంగాలలో ఆవిష్కృత మౌతున్న జ్ఞానార్జనా ప్రక్రియకు తోడ్పడే బాధ్యతలతో ప్రపంచ కేంద్రంలోనూ, ఇతరచోట్లా, పలువిధ కార్యాలయాలనూ, ప్రాతినిధ్య సంస్థలనూ నెలకొల్పడం జరిగింది. విశ్వాసంలో మా సోదరీసోదరులారా, ఇదంతా ప్రపంచదూషితుడై ఉండిన ఆయన పట్ల మీ భక్తిభావం ఫలింపచేసిన దానిని గురించి మేము స్మరించుకోగలిగిన గాథలో ఒక భాగమే తప్ప మరొకటి కాదు. ప్రియతమ గురువర్యుడు ఒక సారి భావోద్వేగపరవశుడై: ‘‘ఓ బహాఉల్లా ! ఏం చేశావు?’’ అని ఆక్రందించిన వేదనామయ వాక్కులను ప్రతిధ్వనించడం తప్ప మేమింకేమీ చేయలేం.

ప్రాధాన్యతాయుతమైన పావుశతాబ్ద సంబంధిత విహంగవీక్షణం నుండి, మా దృష్టిని ఇప్పుడు, పూర్తిగా ఈ మధ్యదీ, మునుపు ముగిసిపోయిన ప్రణాళికలకు పలువిధాలుగా పూర్తి విభిన్నమైనదీ అయిన, పంచవర్ష ప్రణాళిక మీదికి సారిస్తున్నాం. గత ఇరవయ్యేళ్లలోనూ తాము నేర్చిన దాన్నంతటినీ వినియోగించుకుని, దానిని పూర్తిగా అమలు పరచవలసిందని ఈ ప్రణాళికలో మేము ప్రపంచ బహాయిలకు విజ్ఞప్తిని చేశాం. ఇందుకు సంబంధించిన మా ఆశయాలు అనుకున్న దానికన్నా అధికంగానే సాధించబడినాయి; అయితే, శుభసౌందర్యుని అనుయూయల నుండి మేము సహజంగానే మహత్తరాంశాలను ఆశించేటప్పుడు, వారి బహత్ప్రయత్నాల కార్యసాధన స్వభావం నిజంగా విస్మయ పూర్వకంగా ఉన్నది. ఇరవై ఐదు సంవత్సరాల కార్యసాధనకు శిఖరశిల ఇది.

ప్రపంచవ్యాప్తంగా స్థానిక సమాజాలను సముత్తేజ పరచిన రెండు వేర్వేరు పవిత్ర ద్విశతజయంతులతో త్రిధాకరిత మైనందువల్ల ఆ ప్రణాళిక విశేషించి చిరస్మరణీయమైంది. సమాజంలోని సమస్తవర్గాల ప్రజలనూ భగవంతుని దివ్యావతార జీవితోత్సవాన్ని జరుపుకోవడంలో నిమగ్నం గావించగల సామర్ధ్యాన్ని మున్నెన్నడూ చూసి ఉండని స్థాయిలో, సాపేక్ష సౌలభ్యతతో విధేయుల సమూహం ప్రదర్శించింది. ఒక విధమైన సువిస్తృతికి: అంటే దివ్యధర్మ పురోగమనానికి అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తులను వినియోగించగల సమర్ధతకు - శక్తిసమన్విత సంకేతమది. స్పందన ఎంత మహత్తరంగా ఉందంటే, అనేకచోట్ల దివ్యధర్మం అస్పష్టదశ నుండి జాతీయస్థాయి నందుకున్నది. ఊహించని, బహుశః ఆశించనైనా ఆశించని చోట్ల దివ్యధర్మం పట్ల గణనీయమైన సానుకూలవైఖరి అభివ్యక్తమైంది. ఈనాడు ప్రపంచవ్యాప్త బహాయి సమాజాలకు స్వభావసిద్ధమైన ఆధ్యాత్మిక చైతన్యంతో తమకు తటస్థించిన ముఖాముఖితో వేలాది, వేలాది, వేలాదిమంది - ముగ్ధులయ్యారు. ఒక బహాయి పవిత్రదినాన్ని పాటించడం వల్ల సాధ్యం గావించబడింది ఏమిటనే దాని పట్ల దార్శనికత ఎంతగానో విస్తరించడం జరిగింది.

మామూలుగా సంఖ్యాత్మకంగా చూసుకుంటే, ప్రణాళిక ఫలితసాధనలు, దానికన్నా ముందు 1996 నుండి వచ్చిన సకల ప్రణాళికల ఫలితసాధనలకూ సత్వరమే గ్రహణాన్ని పట్టించాయి. ఈ ప్రణాళిక మొదట్లో, ఒక నిర్ణీతసమయంలో కేవలం 100,000కు పైగా ప్రధాన కార్యక్రమాలను నిర్వహించగల సామర్ధ్యం ఉండేది; ఇరవై సంవత్సరాల సమిష్టికృషి ఫలం అది. ఇప్పుడు, ఏకకాలంలో 300,000 ప్రధాన కార్యక్రమాలు స్థిరంగా కొనసాగించబడుతున్నాయి. ఆ కార్యక్రమాలలో పాల్గొనేవారి సంఖ్య ఇరవై లక్షలకు పెరిగింది, ఇదీ త్రిగుణాత్మక పెరుగుదలకు సమీపమే. 329 జాతీయ, ప్రాంతీయ శిక్షణా సంస్థానాలు పని చేస్తున్నాయి, వాటి సామర్ధ్యం - పదిలక్షలలో ముప్పాతిక వంతు మంది శ్రేణిలోని పుస్తకాలలో కనీసం ఒక్కదాన్ని పూర్తిచేయ గలిగారన్న వాస్తవంతో స్పష్టీకతమైంది; మొత్తంగా, ఇప్పుడు వ్యక్తులు పూర్తి చేసిన శిక్షణాక్రమాల సంఖ్య సైతం ఇరవై లక్షలు―ఐదేళ్లలో మూడోవంతుకన్నా మరింత ఎక్కువ ఎదుగుదలే.

ప్రపంచమంతటా అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ద్యోతకమౌతున్న మహోధృతి తనదైన మనోజ్ఞ గాథను చెబుతున్నది. ఈ ఐదేళ్ల వ్యవధిలో, అభివృద్ధి ఆరంభమైన 5,000 సముదాయాలలో ప్రతి ఒక్కదానిలోనూ, అది - వేగవంతం కాబడాలని పిలుపునిచ్చాం. ఈ ప్రధానసూచన - ప్రపంచవ్యాప్తంగా నిబద్ధతాయుత కృషికి ప్రేరణ అయ్యింది. ఫలితంగా, విశేషాభివృద్ధి కార్యక్రమాల సంఖ్య రెండింతలకు పైగా పెరిగి, ఇప్పుడు దాదాపు 4,000 ల వద్ద ఉన్నది. ప్రపంచ ఆరోగ్యసంక్షోభం మధ్యన, దివ్యధర్మాన్ని నూతన గ్రామాలకూ, సామీప్య ప్రాంతాలకూ విస్తరింపచేయడంలో అంతర్లీనమై ఉన్న ఇబ్బందులు కానీ, మహమ్మారి మొదలైనప్పటికి ఆరంభదశలో ఉండిపోయిన విస్తరణ కార్యకలాపాలు కానీ - ప్రణాళిక చివరి సంవత్సరంలో మరింత ఎక్కువ మొత్తాన్ని అందుకోనివ్వకుండా అవరోధించాయి. అయితే, ఇంతకన్నా చెప్పవలసింది ఉంది. ప్రణాళిక ఆరంభంలో - మిత్రులు నిరంతరాభివృద్ధి వెంట మూడవ మజిలీని చేరుకున్న సముదాయాల సంఖ్య, వాటి కార్యక్రమాల పరిధిలోకి అధికసంఖ్యాకులను ఎలా స్వాగతించాలన్న పరిజ్ఞాన పర్యవసానంగా - మరిన్ని వందల్లో వృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాం. ఆ మొత్తం, అప్పుడు - రమారమి 40 దేశాలలో విస్తరించుకుని 200 వద్ద నిలిచింది. ఐదు సంవత్సరాలు గడిచేసరికి, ఈ సంఖ్య 100 దేశాలలో ఆశ్యర్యకరంగా 1,000 కి పెరిగింది―ప్రపంచంలోని మొత్తం విశేషాభివృద్ధి కార్యక్రమాలలో ఇది నాలుగో వంతూ, మా అంచనాలను ఎంతగానో అధిగమించిన కార్యసాధన కూడాను. అయినా, ఈ సంఖ్యలు సైతం - సమాజం అందుకున్న అత్యంత సమున్నత శిఖరాలను వ్యక్తీకరించలేవు. స్థిరంగా కొనసాగించబడుతున్న ప్రధాన కార్యక్రమాలు 1,000 ని అధిగమిస్తున్న సముదాయాలు - 30కి పైగానే ఉన్నాయి; కొన్నిచోట్ల, ఈ మొత్తం - ఒక్క సముదాయంలోనే 20,000 మంది భాగస్వామ్యంతో - అనేక వేలల్లో ఉన్నది. దాదాపుగా గ్రామంలోని అందరు బాలల, కిశోరప్రాయుల అవసరాలను తీర్చే విద్యాకార్యక్రమాల వికాసాన్ని, ఇప్పుడు, అసంఖ్యాక స్థానిక ఆధ్యాత్మిక సభలు పర్యవేక్షిస్తున్నాయి; అదే అధివాస్తవికత ఇప్పుడు కొన్ని పట్టణ సామీప్యప్రాంతాలలో గోచరించ నారంభిస్తున్నది. బహాఉల్లా దివ్యావిష్కరణతో సాంగత్యం - ముఖ్యసందర్భాలలో, వ్యక్తులనూ, కుటుంబాలనూ, ఉమ్మడి బంధుత్వాలనూ అధిగమించి పోయినట్లనిపిస్తున్నది―అంటే ఉమ్మడికేంద్రం దిశగా ప్రజాసమూహాల పయనం అన్నమాట. కొన్ని సందర్భాలలో, వైరివర్గాల మధ్యన ఉన్న పూర్వకక్షలను వదిలివేసుకోవడం జరుగుతున్నది, దైవబోధనల నేపధ్యంలో కొన్ని సామాజిక వ్యవస్థలూ, ప్రవర్తనారీతులూ పరివర్తితాలౌతున్నాయి.

ఇంతటి మనోహరాన్విత పురోగమనాలతో మహదానందభరితులం కాకుండా ఉండలేకపోతున్నాం. బహాఉల్లా దివ్యధర్మానికి గల సమాజనిర్మాణ శక్తి మరింత స్పష్టతతో అభివ్యక్తీకృత మౌతున్నది; ఇక ఇదే సుస్థిర పునాది మీద ఆరంభమౌతుంది -- రానున్న నవవర్ష ప్రణాళిక. ఆశించినట్లుగానే, స్పష్టమైనశక్తితో కూడిన సముదాయాలు, జ్ఞానం పరంగానూ, వనరుల పరంగానూ తమ పొరుగువాటికి భాండారాలుగా నిరూపితమయ్యాయి. అటువంటి సముదాయాలు ఒకటికి మించి ఉన్న ప్రాంతాలు, ఒక దాని వెంట ఒకటిగా సముదాయాల అభివృద్ధిని వేగవంతం గావించే మార్గాన్ని మరింత సులభంగా అభివృద్ధి చేశాయి. అయితే, ప్రగతి దాదాపుగా సార్వత్రికతకు చేరువ కావడం జరిగిందని మరోసారి నొక్కి చెప్పాలని మాకు బలంగా అనిపిస్తున్నది; ప్రదేశానికీ ప్రదేశానికీ ప్రగతిలో ఉన్న వ్యత్యాసం - స్థాయికి సంబంధించినదే. సామూహిక ధర్మావలంబన ప్రక్రియ పట్ల సమాజానికి ఏర్పడిన అవగాహనా, ఈ ప్రక్రియను ఏ పరిస్థితుల సంచయంలో నైనా ఉద్దీపింప చేయగలగడంలో దానికి గల ఆత్మవిశ్వాసమూ - గత దశాబ్దాలలో అనూహ్య స్థాయిలకు ఎదిగిపోయాయి. సుదీర్ఘకాలంగా వేధిస్తున్నవీ, 1996లో నిశిత పరిశీలనలోకి తీసుకురాబడినవీ అయిన లోతైన ప్రశ్నలకు బహాయి ప్రపంచం ఆమోదనీయంగా ప్రత్యుత్తరాలను ఇచ్చింది. తమ యావజ్జీవితాలలోనూ సమాజప్రగతి ముద్రితమైపోయిన విశ్వాసుల తరం ఒకటున్నది. కాని, జ్ఞానార్జనాసీమలు (విజ్ఞాన శిఖరాలు) విస్తారితాలౌతున్న పలు సముదాయాలలో చోటుచేసుకున్నదాని సంపూర్ణస్థాయి - సామూహిక ధర్మావలంబన ప్రక్రియ లోని ఒక ప్రధాన పురోగమనాన్ని, చారిత్రాత్మక స్థాయిగల మహత్త్వపూర్ణ పురోభివృద్ధిగా పరివర్తన గావించింది.

సంరక్షకుడు దివ్యధర్మ యుగాలను క్రమానుగత యుగాంశాలుగా ఎలా విభజించాడో చాలామందికి సుపరిచిత మౌతుంది; రచనాత్మక యుగపు పంచమ యుగాంశం 2001లో మొదలైంది. అంత బాగా తెలియనిది: ధర్మసంరక్షకుడు దివ్యప్రణాళికలో యుగాంశాలూ, ఆ యుగాంశాలలో దశలూ ఉండడం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడన్నది. పరిపాలనా సంవిధానానికి సంబంధించిన స్థానిక, జాతీయ వ్యవస్థలు అభివృద్ధి గావించబడుతూ, దృఢీకృతాలౌతూ ఉండగా, అబ్దుల్-బహా మేధాజనితమై, రెండు దశాబ్దాల పాటు సుప్తచేతనావస్తలో ఉంచబడిన దివ్యప్రణాళికను, దాని ప్రథమ యుగాంశపు తొలి దశతో: అంటే ఉత్తర అమెరికా బహాయి సమాజానికి ధర్మసంరక్షకుడు అప్పగించిన సప్తవర్ష ప్రణాళికతో, 1937లో, లాంఛనప్రాయంగా - ప్రారంభించడం జరిగింది. 1963లో ప్రపంచవ్యాప్తంగా దివ్యధర్మ పతాకసంస్థాపనగా పరిణమించిన దశవర్ష మహోద్యమ పరిపూర్తి అనంతరం ఈ ప్రథమ యుగాంశం ముగిసింది. ద్వితీయ యుగాంశపు టారంభదశ - తొలి నవవర్ష ప్రణాళిక; పన్నెండు మాసాల నుండి ఏడు సంవత్సరాల వ్యవధి వరకూ విస్తరించిన ప్రణాళికలు, పదికి తక్కువ కాకుండా, దానిని అనుసరించి వచ్చాయి. ఈ రెండవ యుగాంశపు టారంభం జరిగిన నాటికే, దివ్యప్రణాళిక కృతికర్త అభిదర్శించిన: ’దివ్యధర్మంలోకి సామూహిక ప్రవేశాల’ ప్రప్రథమ సమారంభాలను బహాయి ప్రపంచం అవలోకిస్తున్నది; అనంతర దశాబ్దాలలో, మహాఘననామ సమాజంలోని విధేయవిశ్వాసుల తరాలు, స్థిరంగా కొనసాగించబడిన విస్తృతస్థాయి అభివృద్ధికి అవసరమైన పరిస్థితులను పెంపొందింప చేసేందుకై దివ్యద్రాక్షావాటికలో శ్రమించాయి. ఈ సముజ్జ్వల రిద్వాన్ పర్వకాలం నాటికి, ఆ శ్రమఫలితాలు ఎంతటి అపారమైనవి! గణనీయ సంఖ్యాకులు సమాజ కార్యకలాపాలను వృద్ధి చేస్తూ ఉండడం, విశ్వాసస్ఫూర్తిని అందిపుచ్చుకోవడం, ప్రణాళిక అగ్రభాగాన సేవలను అందించేందుకు సత్వరమే ఉద్యమించడం అన్న విశిష్టఘటన - విశ్వాసంతో కొనసాగుతూ వచ్చిన భవిష్యసూచన నుండి, పునరావృత వాస్తవికతకు మారింది. అటువంటి ప్రస్ఫుట, ప్రదర్శనీయ పురోగమనం - దివ్యధర్మ చరిత్రపుటలలో ప్రస్తావనను అనివార్యంగా ఆశిస్తున్నది. గురువర్యుడి దివ్యప్రణాళిక తృతీయ యుగాంశం ప్రారంభమైందని, ప్రమోదభరిత హృదయాలతో, ప్రకటిస్తున్నాం. ప్రతి హృదయాన్నీ దివ్యసామ్రాజ్య దీప్తి జ్యోతిర్మయం గావించేంత వరకూ - దశలవారీగా, యుగాంశాలవారీగా - ఆయన దివ్యప్రణాళికా వికాసం జరుగుతుంది.

ప్రియతమ మిత్రులారా, దివ్యప్రణాళిక ద్వితీయ యుగాంశానికి ముగింపును పలికిన పంచవర్ష బహద్యత్న సమీక్ష ఏదీ కూడా, దాని తుది సంవత్సరాన్ని వెన్నంటివచ్చి, ఇంకా పీడిస్తూనే ఉన్న ఉపద్రవాల విశేష ప్రస్తావన లేకుండా పరిపూర్ణం కాదు. ఈ కాలం అంతటా, వ్యక్తిగత వ్యవహరణంపై చాలా దేశాలలో పెరుగుతూ తరుగుతూ వచ్చిన ఆంక్షలు, సమాజపు సమిష్టి యత్నాలకు తీవ్రవిఘాతాన్ని కలిగించి ఉండేవి, దానినుండి కోలుకోవడానికి సంవత్సరాలు పట్టి ఉండేది, కాని అది సమస్యే కాకపోవడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి: మాననవాళిని సేవించడమనే బహాయిల కర్తవ్యానికి సంబంధించిన సువిస్తృత చైతన్యం - విపత్కర, ప్రతికూల సమయాలలో కన్నా - ఎన్నడూ అలా లేదు. ఇంకొకటి: ఆ చైతన్య వ్యక్తీకరణా సామర్ధ్యానికి సంబంధించి, బహాయి ప్రపంచంలో చోటుచేసుకున్న అసాధారణ పెరుగుదల. అనేక సంవత్సరాలకు పైగా వ్యవస్థీకత కార్యాచరణ నమూనాలను అనుసరించడానికి అలవాటుపడిన మిత్రులు - తాము అభివృద్ధి చేసిన నూతన విధానాలను, క్రమానుగత ప్రణాళికలలో పరిపుష్టం గావించడానికి తాము శ్రమించి ఉన్న కార్యసారణికి అనుగుణంగా ఉండేలా చూసుకుం టూనే, అనూహ్యసంక్షోభానికి - తమ సృజనాత్మకతనూ, సంకల్పస్పృహనూ అనువర్తింప చేశారు. ఇది, బహాయిలు - దేశదేశాలలోని తమ సాటి విశ్వాసుల వలెనే, భరించిన తీవ్రక్లేశాలను ఉపేక్షేంచడం కాదు; అయినా, దుర్భర కష్టాలలోనూ, విశ్వాసులు నిశ్చలచిత్తులై నిలిచారు. అవసరంలో ఉన్న సమాజాల కోసం వనరులను వినియోగించడం జరిగింది, సాధ్యమైనచోట్ల ఎన్నికలు ముందుకు సాగాయి, దివ్యధర్మవ్యవస్థలు సర్వావస్థలలోనూ తమ విధుల నిర్వహణను కొనసాగిస్తూనే వచ్చాయి. సాహసోపేత చర్యలనూ తీసుకోవడం జరిగింది. సావ్ తోమీ, ప్రిన్సిపీ జాతీయ ఆధ్యాత్మిక సభ ఈ రిద్వాన్‌కు పునఃస్థాపితమౌతుంది; విశ్వన్యాయ మందిర నూతనస్తంభాలు, రెండు: జాగ్రెబ్ మూలపీఠంగా క్రోయేషియా జాతీయ ఆధ్యాత్మిక సభ, డిలి మూలపీఠంగా టిమోర్-లెస్టీ జాతీయ ఆధ్యాత్మిక సభ - నెలకొల్పబడతాయి.

ఇక, ఏకవర్ష ప్రణాళిక మొదలౌతున్నది. ఒడంబడిక దినోత్సవాన పంపబడిన మా సందేశంలో దాని లక్ష్యాన్నీ, అవసరాలనూ ఈ సరికే నిర్దేశించడం జరిగింది; సంక్షిప్తమే అయినా, ఈ ప్రణాళిక - తనను అనుసరించి వచ్చే నవవర్ష ప్రణాళిక నిమిత్తం బహాయి ప్రపంచం సన్నద్ధం కావడానికి సరిపోతుంది. దివ్యప్రణాళికా ఫలకాల ఆవిష్కరణానంతరం నూరేళ్లకు మొదలైన విశిష్ట శక్తిసమన్విత కాలం, అబ్దుల్-బహా శతవర్ధంతి వెనువెంటనే - రచనాత్మక యుగపు ప్రథమ శతాబ్దపు సంపూర్తినీ, ద్వితీయ శతాబ్దపు టారంభాన్ని సూచిస్తూ - ముగుస్తుంది. మానవాళి తన భేద్యగుణం బహిర్గతం కావడంతో దారికి వచ్చి, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సంయుక్త కృషి అవసరం పట్ల మరింత అప్రమత్తంగా ఉన్నట్లనిపిస్తున్న తరుణంలో, విధేయుల సందోహం ఈ నూతన ప్రణాళికలోనికి ప్రవేశిస్తున్నది. అయినా, సమాజంలోని అధికసంఖ్యాకులు తాము సైతం మానవాళి సహజసిద్ధ ఏకత్వంపట్ల మహామోదాన్ని ఎలా కాంక్షిస్తున్నారో వాచా, కర్మణా వ్యక్తం చేస్తున్నప్పటికీ - స్పర్థ, స్వప్రయోజనం, పక్షపాతం, సంకుచిత మనస్తత్వం వంటి దీర్ఘకాలిక అలవాట్లు సమైక్యత దిశగా ప్రస్థానాన్ని ప్రతిరోధిస్తూనే ఉన్నాయి. ప్రజాసంక్షేమ ప్రయోజనాల దృష్ట్యా తన విభేదాలను అవతల పెట్టడంలో, దేశసంచయం విజయాన్ని సాధించుగాక అని ప్రార్ధిస్తున్నాం. రానున్న మాసాలను ఆవరించుకునే అనిశ్చితులకు అతీతంగా, తన అనుయాయులను సుదీర్ఘకాలంగా పరిపోషిస్తూ వచ్చిన ఆశీస్సులను మరింత సమృద్ధిగా, తన ఆరోగ్యకరణ సందేశావసరం సదా అపారమే అయిన ప్రపంచం యొక్క అనిశ్చితితో మీ స్థైర్యం సంచలించక, మీరు మీ లక్ష్యంలో ముందుకు సాగేలా - అనుగ్రహించమని బహాఉల్లాను వేడుకుంటున్నాం.

దివ్యప్రణాళిక నూతన యుగాంశంలోనికి, నూతన దశలోనికి ప్రవేశిస్తున్నది. పుటను త్రిప్పడమైనది.

 

Windows / Mac